నక్కపల్లి, న్యూస్టుడే: -
రైళ్లబండిలో విశాఖ రుచులు
విక్రయాలకు ఐఆర్సీటీసీతో సెర్ప్ ఒప్పందం
జిల్లాలో నక్కపల్లి నుంచి సరఫరా
డ్వాక్రా ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్న పొదుపు సంఘాల మహిళలకు మరో అరుదైన గుర్తింపు లభించనుంది. వారు తయారు చేస్తున్న తినుబండారాలు ఇక నుంచి రైళ్లలోనూ...
more... విక్రయించనున్నారు. ఇందుకు ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్), సెర్ప్ (పేదరిక నిర్మూలన సంస్థ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందుకు జిల్లాలో నక్కపల్లి నుంచే తొలి అడుగు పడనుంది. దీనిపై ‘న్యూస్టుడే’ కథనం.
జిల్లాలో పొదుపు సంఘాల సభ్యులు స్వయం ఉపాధి కింద తయారు చేస్తున్న ఉత్పత్తులను ఆర్నెల్ల క్రితం వరకు ఎక్కడికక్కడే విక్రయించేవారు. వీటన్నిటినీ ఒకే చోటకు చేర్చి అందరికీ అన్ని రకాల ఉత్పత్తులు అందుబాటులోకి తేనున్నారు. ఆ ఉత్పత్తులకు తగిన గుర్తింపు ద్వారా ఆర్థిక పరిపుష్టి కల్పించడానికి ప్రభుత్వం సెర్ప్ ఆధ్వర్యంలో జిల్లాలో డ్వాక్రా బజార్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తొలిసారిగా నక్కపల్లి సహా జిల్లాలోని నాలుగు మండలాల్లో వీటి విక్రయాలు ప్రారంభించారు. అందుబాటులో ఉంచిన వీటిలో ఇళ్లలో ఉపయోగపడే వివిధ రకాల వస్తువుల సహా తినుబండరాలకు ప్రస్తుతం ఆదరణ పెరుగుతోంది.
డ్వాక్రా బజార్ల నిర్వహణపై ఇటీవల విశాఖలో సెర్ప్ సీఈఓ ఆరోఖ్యరాజ్ సమావేశం నిర్వహించి ఉత్పత్తుల విక్రయాలపై చర్చించారు. నక్కపల్లి సంఘం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ ఉత్పత్తులను స్థానికంగానే పరిమితం చేయకుండా అందరికీ చేరేలా చేయాలని నిర్ణయించారు. ఇందుకు రైల్వే శాఖను ఎంచుకొని, ఆ ఆలోచనను అమల్లో పెట్టించారు. నక్కపల్లి మండలం సహా జిల్లాలోని ఇతర మండలాల్లో ఒకట్రెండు రకాల ఉత్పత్తులకు మంచి పేరుంది. వీటికి రుచిపరంగా ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా వేంపాడు గ్రామ పరిధిలో తయారవుతున్న ఆహార పదార్థాలకు తగిన గుర్తింపు ఉండటంతో వీటినే ముందుగా రైల్వేలోకి పంపించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇక్కడ వివిధ రకాల పూతరేకులు, సున్నుండలు, మామిడితాండ్ర (మ్యాంగోజెల్లీ), చిప్స్ (అప్పాలు, చేగొడీలు), వివిధ రకాల పచ్చళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. మాడుగుల హల్వా, ఎస్.రాయవరం కోవా ప్రసిద్ధి. దీంతో పచ్చళ్లు మినహా మిగిలిన తినుబండారాలను రైళ్లలో విక్రయించడానికి వీలుగా ఒప్పందం
కుదుర్చుకున్నారు. వేంపాడుకి చెందిన శ్రీశ్రీనివాస సంఘం పేరిట వాటిని సరఫరా చేయనున్నారు. ఆహార భద్రత విభాగం నుంచి సంఘం పేరిట నాణ్యత అనుమతి పత్రం లభించింది. ఇది ఏడాదికోసారి నవీకరణ చేయించుకోవాలి. తొలి దశలో 15 రకాల ఆహార పదార్థాలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు సంబంధించిన ఛాయాచిత్రాలను ఐఆర్సీటీసీకి పంపించారు. వీటిని ఈ - కేటరింగ్ ద్వారా ప్రయాణికులకు మెనూ జాబితాలో ధరలు చూచిస్తారు. ప్రయాణికులు కోరుకున్న పదార్థాలను సిబ్బంది చేరవేస్తారు. ఇక్కడ్నుంచి జరిపే విక్రయాల ఆధారంగా జిల్లాలోని మిగిలిన సంఘాల నుంచి ఇతర రకాలను విక్రయించడానికి వీలుగా సెర్ప్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. త్వరలోనే విశాఖ రైల్వేస్టేషన్లో ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కాస్త సమయం పట్టనుంది. ఇక్కడైతే అన్ని రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచి విక్రయిస్తారు. ఇవన్నీ సత్ఫలితాలిస్తే జిల్లాలోని డ్వాక్రా ఉత్పత్తులకు త్వరలోనే అరుదైన గౌరవం, గుర్తింపు దక్కనుంది. ఈ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ జిల్లా సహా విజయవాడ, తిరుపతి నుంచి కూడా ఈ ప్రయోగాన్ని అమలు చేయాలని సెర్ప్ రాష్ట్ర ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.
త్వరలోనే విక్రయాలు ఆరంభం
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పేరొందిన డ్వాక్రా మహిళలు తయారుచేస్తున్న తినుబండరాలు రుచికరంగా ఉండటంతో వీటిని రైల్వేలో విక్రయించాలని సెర్ప్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి, త్వరలోనే రైల్వేకు చేరుతాయి. రెండు వారాల్లో ఇది అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం చేసిన ఆలోచన ద్వారా డ్వాక్రా మహిళలకు మరింత గుర్తింపు రానుంది. మరిన్ని ఉత్పత్తులను రైళ్లలో విక్రయించేలా చర్యలు చేపడుతున్నాం.
- సత్యసాయి శ్రీనివాస్, డీఆర్డీడీఏ పథ సంచాలకులు, విశాఖపట్నం